రైతు కుటుంబం నుంచి రూ. 10,000 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి

  • పట్టుబడిన మహబూబాబాద్ జిల్లా, మర్రిపెడ మండల వ్యవసాయ విస్తరణాధికారి
  • రైతు బీమా పరిహార దస్తావేజును ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి లంచం
  • రూ. 10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
రైతు కుటుంబం నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఒక అధికారి అడ్డంగా దొరికిపోయాడు. మహబూబాబాద్ జిల్లాలోని మర్రిపెడ మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో వ్యవసాయ విస్తరణాధికారి జీ. సందీప్ ఏసీబీకి పట్టుబడ్డాడు.

జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబం ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తన రైతు బీమా పరిహార దస్తావేజును ప్రాసెస్ చేసి, దానిని ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి రూ. 10,000 లంచం అడిగాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుని నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖకు తెలియజేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది. అవినీతి నిరోధక శాఖ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునని తెలిపింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అందించవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇచ్చింది.

Sandeep G
ACB
Anti Corruption Bureau
Mahabubabad
Marripeda
Agriculture Extension Officer
Bribery Case

More Telugu News